10 ఏళ్ల తర్వాత టీచర్స్ డే వేడుకలకు సీఎం హాజరు
టీచర్స్ డే అనగానే ఉపాధ్యాయుల హర్షం, ఆనందం అలరారుతాయి. ఈ ప్రత్యేక దినోత్సవంలో అవార్డులు అందుకునే గురువుల ఆనందమే వేరు. అభినందనలు వెల్లువెత్తే ఈ వేదికకు ముఖ్యమంత్రి హాజరవుతే, ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. గతంలో 2014లో రవీంద్రభారతి వేదికగా జరిగిన టీచర్స్ డే వేడుకలకు అప్పటి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత, ఈసారి సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మాదాపూర్ శిల్పకళావేదికలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.
హైదరాబాద్: ఈ రోజు, రేపు వర్షాల హెచ్చరిక!
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల వివరాల ప్రకారం, వర్షం ఎప్పుడైనా ఒక్కసారిగా ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వినాయక నిమజ్జనోత్సవం భద్రత కోసం 30 వేల మంది పోలీసు సిబ్బంది
మహానగరంలో వైభవంగా జరగనున్న గణేశ్ నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల కమిషనర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 6న జరిగే శోభాయాత్రకు 30 వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా కిందిస్థాయి అధికారులకు ముందస్తు ఆదేశాలు జారీ చేశారు
హైదరాబాద్ వెస్ట్ జోన్లో 1638 వినాయకుని విగ్రహాలు
సిటీ వెస్ట్ జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 1,638 మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇందులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 274, బోరబండలో 268, మాసబ్ట్యాంక్లో 44, ఎస్.ఆర్.నగర్లో 239, పంజాగుట్టలో 185, ఫిల్మ్నగర్లో 215, మధురానగర్లో 287, జూబ్లీహిల్స్లో 126 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా 278 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు.